Home> తెలంగాణ
Advertisement

తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు

ప్రపంచానికే తలమానికమైన నేల తెలంగాణ ..ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాల నిలయం. ముక్కోటి దేవతలు కొలువువైన ఈ తెలుగు నేల ..ఆకుపచ్చని అరణ్యాల నెలవు.  ఆకాశం నుంచి దుంకే జలపాతలు...ఒక్కటేంటి ఇక్కడి చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా ప్రతీది దర్శించుకోవలసినవే. మన బంగారు తెలంగాణ గడ్డ పర్యాటక ఆకర్షణలపై ఓ లుక్కేద్దాం...

 తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలకు నిలయం తెలంగాణ గడ్డ.. ముక్కోటి దేవతలు కొలువైన ప్రాంతం, ఆకుపచ్చని అరణ్యాల నెలవు, ఆకాశం నుంచి దుంకే జలపాతల కొలువు .. ఇలా చెప్పుకుంటే పోతే మాటలు అంతమౌతాయి కానీ..వర్ణన అంతం కాదు..  ఒక్క మాటలో చెప్పాలంటే .. ఒక్కటని కాదు ప్రపంచానికే తలమానికమైన నేల తెలంగాణ. ఇక్కడి చెట్టు, చేమ, నీరు, రాయి ఇలా ప్రతీది దర్శించుకోవలసినవే.

భాగ్యనగరంగా పిలుచుకునే హైదరాబాద్ నుంచి పచ్చదనానికి మారుపేరుగా నిలిచిన ఆదిలాబాద్ వరకు 31 జిల్లాలు వేటికవే సాటి. తెలంగాణ రాష్ట్రంగా అవతరించడం..తదనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పర్యాటక రంగం కొత్త శోభను సంతరించుకుంటోంది. ప్రపంచాన్ని అబ్బురపరిచే తెలంగాణ పర్యాటక ప్రాంతాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా మరి..!

భాగ్యనగరం హైదరాబాద్..  

భారత్ దేశ పఠంలోనే కాక ప్రపంచం వ్యాప్తంగా చెప్పుకోదగ్గ పట్టణాలలో హైదరాబాద్ ఒకటి. రాజకీయ,సామాజిక, ఆర్ధికం, పర్యాటకం..ఇలా ఎన్నికోణాల్లో చూసినా హైదరాబాద్‌కు సాటిరాలేదేది. భాగ్యనగరంగా పిలువ పడే మన హైదరాబాద్‌ కు హైదరాబాదే పోటీ. ఇంతటి ప్రాముఖ్యత కల్గిన ఈ నగరంలో పర్యటాక ప్రాంతాలు అనేకం..

పర్యాటక ప్రదేశాలు: గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, అసెంబ్లీ భవనం, చౌమొహల్లా ప్యాలెస్, కింగ్‌కోఠి, పురానీ హవేలీ, ఫలక్‌నుమా ప్యాలెస్ కట్టడాలు చరిత్రకు సజీవసాక్ష్యాలు. ఇండో- అరబిక్- పర్షియన్ వాస్తు శిల్ప కళానైపుణ్యానికి హైదరాబాద్ కట్టడాలు ప్రతీక. ఒక్కో కట్టడానిది ఒక్కో చారిత్రక నేపథ్యం. ప్రపంచంలో ఎక్కడా లేని నిర్మాణశైలి వీటి సొంతం. మక్కా మసీదు, లాల్ దర్వాజా, ఉజ్జయిని మహంకాళి దేవాలయాలు పండుగలకు ప్రధాన ఆకర్షణ. హుస్సేన్‌సాగర్, బుద్ధవిగ్రహం, ట్యాంక్‌బండ్, బిర్లా మందిర్ ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు హైదరాబాద్ సొంతం.

నల్లగొండ  

పర్యాటక ప్రదేశాలు : నాగార్జున సాగర్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. చందంపేట గుహలు, దేవరకొండ కోట, సాగర్ వెనుక జలాల్లోని ఏలేశ్వరం ప్రాంతంలోని మల్లన్నస్వామి ఆలయం ప్రధానమైన పర్యాటక ప్రాంతాలు. మూసీ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉంది. రాచకొండ గుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంతోపాటు, వాడపల్లి, ఛాయా సోమేశ్వర దేవాలయం ప్రాంతాలను అభివృద్ధి చేయాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. రుద్రమ మరణ ధ్రువీకరణ శాసనం ఉన్న చందుపట్లను హెరిటేజ్ టూరిజంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.
నల్లగొండకు హైదరాబాద్ నుంచి అనేక బస్సులు ఉన్నాయి. రైల్వే సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ 153.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి ప్రత్యేక బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

యాదాద్రి భువన గిరి  
పర్యాటక ప్రదేశాలు : కొలనుపాక జైనదేవాలయం, ఏకశిలపై వెయ్యేళ్ల క్రితం నిర్మించిన భువనగిరి కోట చూడదగ్గ ప్రదేశాలు. భువనగరి కొండ రాక్ ైక్లెంబిగ్‌కు అనుకూలం. తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సుప్రసిద్ధం. పోచంపల్లి చీరలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. తెలంగాణ పర్యాటక శాఖ యాదాద్రి భువనగిరి కోట మీదకు కేబుల్ కారు ఏర్పాటు చేయనుంది. దీనివల్ల పర్యాటకంగా జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది.

వరంగల్ 
ఓరుగల్లు పేరుతో విలసిల్లిన వరంగల్ జిల్లా పునర్విభజనలో భాగంగా నగరం చుట్టూ ఉన్న మండలాలన్నీ కలిపి వరంగల్ అర్బన్ జిల్లాగా ఆవతరించింది. తెలంగాణలో సికింద్రాబాద్ తర్వాత ప్రధాన రైల్వే జంక్షన్ కాజీపేట ఇక్కడే ఉంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్దది.
పర్యాటక ప్రాంతాలు: తెలంగాణ ప్రజలు కొలిచి మొక్కే భద్రకాళి దేవాలయం, చరిత్రాత్మక వేయి స్తంభాలగుడి, ఖిలా వరంగల్, కాకతీయ తోరణం, ఖుష్ మహల్, నైజాం కాలంనాటి మామునూరు విమానాశ్రయం ఈ జిల్లాలోనే ఉన్నాయి.

కొత్త ఆకర్షణలు : మామునూరు విమానాశ్రయాన్ని పునరుద్ధ్దరించినట్లయితే పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చినట్లవుతుంది. దీనితోపాటు ఇక్కడ నిర్మించతలపెట్టిన టెక్స్‌టైల్ పార్క్, హైదరాబాద్- వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, వ్యాగన్ వర్క్‌షాప్ పూర్తయితే పర్యాటక రంగం మరింత అభివృద్ధికి నోచుకుంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు కాజీపేట లేదా వరంగల్ రైల్వేస్టేషన్‌లో దిగితే తిరగడానికి సిటీ బస్సులుంటాయి. హైదరాబాద్ నుంచి యాదాద్రి 62.1 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుంచి యాదాద్రికి పెద్ద సంఖ్యలో బస్సులు ఉన్నాయి.

సిరిసిల్ల ...

చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్ల. అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరను నేసిన ఘనత సిరిసిల్లదే. ఈ ప్రాంతం మరనేత, చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడ కూడా చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు అనేకం.. 

పర్యాటక ప్రాంతాలు : దక్షిణ కాశీ క్షేత్రంగా, కోడె మొక్కుల దేవుడిగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈ జిల్లాలోనే ఉంది. ఎగువ మానేరు జలాశయం కూడా ఇక్కడే ఉంది. సిరిసిల్ల చేనేత పరిశ్రమ, వేములవాడ, నాంపల్లి గుట్ట మొదలైనవి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాల నుంచి వేములవాడకు బస్సులు నడుస్తున్నాయి.

భద్రాద్రి కొత్తగూడెం ...
 

భద్రాచలంలో భక్త రామదాసు కట్టించిన దేవాలయం ఉంది. ఇది తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు గాంచింది.

పర్యాటక ప్రాంతాలు : భద్రాద్రి దేవాలయం, పర్ణశాల, తాలిపేరు, పెద్దవాగు, మూకమామిడి, కిన్నెరసాని, పాలెంవాగు ప్రాజెక్టులు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. అటవి ప్రాంతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల అభయారణ్యం ఏర్పాటుకు అనుకూలం. కిన్నెరసానిలో రూ.15 కోట్లతో హరిత రెస్టారెంట్, ఎకో పార్క్, గెస్ట్ హౌజ్ ఏర్పాటు కానున్నాయి. హైదరాబాద్ నుంచి భద్రాచలం 309.3 కి.మీ. దూరంలో ఉంది. ప్రత్యేక బస్సులు, రైలు సౌకర్యాలున్నాయి. త్వరలోనే విమానాశ్రయం కూడా రానుండడంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందే అవకాశం ఉంది.

నిజామాబాద్ శ్రీరాం సాగర్...

ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రదాయి లాంటి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పుట్టినిల్లు నిజామాబాద్. గోదావరి నది మీద కట్టిన ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమవుతోంది.
పర్యాటక ప్రాంతాలు: బడా పహాడ్ దర్గా, ఖిల్లా జైలు, సిర్నాపల్లి గడీ, సారంగాపూర్ హనుమాన్ దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, దేవల్ మజీద్, కందకుర్తి త్రివేణి సంగమం, రామడుగు జలాశయం, గుత్ప ఎత్తిపోతల పథకాలు, అలీసాగర్, అశోకాసాగర్, జానకంపేట అష్టముఖి కోనేరు, బోధన్ భీమునిగుట్టలు ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాలు. వీటితో పాటు బ్రిటీష్ కాలం నాటి రుద్రూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం, వైద్య కళాశాల చూడదగ్గ ప్రాంతాలు.

ఆదివాసుల ఆదిలాబాద్ ... 

ప్రకృతికి పర్యాయపదంగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గంలో పొచ్చర, గాయత్రి, కనకాయి జలపాతాలున్నాయి. ఇక్కడి ఆదివాసీల ఆరాధ్య దైవమైన కేస్లాపూర్ నాగోబా దేవాలయం ఇంద్రవెల్లి మండలంలో ఉంది. పర్యాటక శాఖ మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే వాటర్‌ఫాల్స్‌కు మరింత ఆదరణ పెరుగుతుంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 304.9 కి.మీ దూరంలో ఉండే జిల్లా ఆదిలాబాద్. హైదరాబాద్ నుంచే కాక కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాల నుంచీ బస్సు, రైల్వే  సౌకర్యాలున్నాయి.

చదువుల తల్లి నిలయం ..

చదువుల తల్లి బాసర జ్ఞానసరస్వతీ దేవి కొలువైన జిల్లా నిర్మల్. తూర్పున అడవులు, పడమర బాసర క్షేత్రం, ఉత్తరాన సహ్యాద్రి పర్వతాలు, దక్షిణాన గోదావరి నది కలిగి ఉన్న అద్భుతమైన జిల్లా ఇది. నిర్మల్ కొయ్యబొమ్మలు, పెయింటింగ్‌లకు పెట్టింది పేరు. ఒకప్పుడు నిజాం ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఇక్కడే ఏర్పాటు చేశారంటారు.

పర్యాటక ప్రాంతాలు: 400 ఏళ్ల క్రితం నిమ్మనాయుడు పాలించడంతో ఆయన పేరుపై వెలిసిందే నిర్మల్. బాసర సరస్వతి దేవాలయం, పాపేశ్వర ఆలయం, అడెల్లి మహాపోచమ్మ ఆలయాలు ఉన్నాయి. స్వర్ణ, గడ్డెన్నవాగు, కడెం జలాశయాలతో పాటు సదర్మాట్ బ్యారేజీ తదితర ప్రాజెక్టులు తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు పర్యాటక ప్రాంతాలుగా వెలుగొందుతున్నాయి. నిర్మల్‌లోని పొచ్చెర, కుంటాల, కడెం జలపాతాలు, జిన్నారం, కవ్వాల్ టైగర్ జోన్ ఫారెస్ట్‌లో వైల్డ్‌లైఫ్ టూరిజం అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ ప్రయత్నిస్తోంది.

 

Read More