Home> తెలంగాణ
Advertisement

సీట్ల సర్దుబాటు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న సీపీఐ

                                       

సీట్ల సర్దుబాటు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న సీపీఐ

సీట్ల పంపకాలపై సీపీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్లాన్ ఏ ప్లాన్ బీ అంటూ చెప్పుకొచ్చిన ఆ పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ ఇచ్చిన 3+2 ఆఫర్ పై చర్చించేందుకు భేటీ అయిన నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేస్తున్న సీపీఐ.. భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ నేతలతో మాట్లాడాలని డిసైడ్ అయ్యింది. ఉదయం జరిగిన కార్యవర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకొని భేటీని సాయంత్రం వరకు వాయిదా వేసింది. సాయంత్రం 6 గంటలకు మరోసారి భేటీ అయిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తెలిపారు. 

4+1 కోసం సీపీఐ పట్టు..

మొదట్లో 15 స్థానాలు కోరిన సీపీఐ.. క్రమంగా దిగి వస్తూ 12..9..5 స్థానాల వద్ద ఆగింది. తమకు ఐదు స్థానాలు కచ్చితంగా ఇవ్వాల్సిదేనని సీపీఐ గట్టిగా కోరింది. కాంగ్రెస్ మాత్రం 3+2 ( మూడు ఎమ్మెల్యే స్థానాలు , రెండు ఎమ్మెల్సీ స్థానాలు) ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీనిపై స్పందించిన సీపీఐ 4+1 ( నాల్గు ఎమ్మెల్యే స్థానాలు ,ఒక ఎమ్మెల్సీ స్థానం) ప్రతిపాదన ఉంచింది. అయితే దీనిపై కాంగ్రెస్ స్పందించడం లేదు. 

కొత్తగూడెం స్థానంపై పట్టు

ఇక స్థానాల కేటాయింపు విషయాకి వస్తే ఈ విషయంలోనూ సీపీఐ,కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. సీపీఐ అడుతున్న సీట్లలో కొత్తగూడెం, బెల్లంపల్లి, వైరా, మంచిర్యాల, మునగోడు, పినపాక, ఆలేరు ఉన్నాయి. వీటిలో ఐదు స్థానాలు తమకు ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతోంది. వీటిలో కొత్తగూడెం సీటు కచ్చితంగా ఇచ్చి తీరాలని సీపీఐ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం బెల్లంపల్లి హస్నాబాద్, వైరా సీట్లు ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేస్తుంది. కొత్తగూడెం సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావడం లేదు. ఇదే అంశంపై చర్చించేందుకు ఉదయం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. జరుగుతున్న పరిణామాలపై మరోసారి భాగస్వామ్య పార్టీ నేతలతో చర్చించి భవిష్యత్తు కార్యచరణ ప్రకటించాలని సీపీఐ నిర్ణయించింది.

Read More