Home> క్రీడలు
Advertisement

2వ టెస్ట్ మ్యాచ్‌లో ఆసిస్ గెలుపు.. ఇక అందరి దృష్టి ఆ 3వ టెస్ట్‌ మ్యాచ్‌పైనే !

2వ టెస్ట్ మ్యాచ్‌లో ఆసిస్ గెలుపు.. ఇక అందరి దృష్టి ఆ 3వ టెస్ట్‌ మ్యాచ్‌పైనే !

నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ స్టేడియంలో జరిగిన 2వ టెస్ట్‌లో ఆసిస్ భారత్‌పై 146 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 5వ రోజు లంచ్‌కి ముందే టీమిండియా బ్యాట్స్‌మెన్ ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా వరుసగా వికెట్లు కోల్పోయి 140 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యారు. దీంతో అప్పటికే 146 పరుగుల ఆధిక్యంలో వున్న ఆసిస్ జట్టు అలవోకగానే భారత్‌పై గెలుపును సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నట్టుగా కనిపించిన కుర్రాళ్లు రిషబ్‌పంత్ (36 పరుగులు; 4X2 ,6X1‌), హనుమ విహారి (20 పరుగులు; 4X2) సైతం ఒకానొక దశలో ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కోలేకపోయారు‌. ఈ ఇద్దరి వికెట్స్ పడిన తర్వాత ఇక టెయిలెండ‌ర్స్ కూడా వెంటవెంటనే పెవిలియన్‌ బాటపట్టారు. 

ఆస్ట్రేలియా బౌల‌ర్స్‌లో నాథన్ లియాన్, మిచెల్ స్టార్క్ తలో మూడు వికెట్స్ తీయ‌గా, హాజిల్ వుడ్‌, క‌మిన్స్ చెరో రెండు వికెట్స్ తీశారు. మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో గెలిచిన భారత్ సిరీస్‌లో పై చేయి సాధించినప్పటికీ.. 2వ టెస్ట్ మ్యాచ్‌లో గెలిచిన ఆసీస్ సిరీస్‌ని స‌మం చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్స్ తీసిన నాథ‌న్ లియోన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. 

ఇక ఇప్పుడు అందరి దృష్టి మెల్‌బోర్న్‌లో డిసెంబ‌ర్ 26న జ‌ర‌గ‌నున్న 3వ టెస్ట్ మ్యాచ్‌పైనే వుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సేన గెలిస్తే, ఆ తర్వాత జరగబోయే చివరి టెస్ట్‌పై కొంత ఒత్తిడి తగ్గుతుంది. ప్రస్తుతం ఇరు జట్లు సమానంగా వుండటంతో 3వ టెస్ట్ మ్యాచ్ ఫలితం సిరీస్‌ని ప్రభావితం చేయనుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
 

Read More