Home> జాతీయం
Advertisement

ఆధార్ లింక్ పేరుతో అకౌంట్‌లో డబ్బులు స్వాహా

అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అంటున్న కేంద్ర ప్రకటనలు కొందరు కేటుగాళ్ళకు కాసులు కురుపిస్తున్నాయి.

ఆధార్ లింక్ పేరుతో అకౌంట్‌లో డబ్బులు స్వాహా

అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అంటున్న కేంద్ర ప్రకటనలు కొందరు కేటుగాళ్ళకు కాసులు కురిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ గురించి సమాచారమే తప్ప స్పష్టత లేని అమాయకులను లక్ష్యంగా చేసుకొని.. వారికి కాల్ చేసి ఆధార్, బ్యాంకు వివరాలు పొంది డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఆధార్‌ లింక్‌ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు ఓ సీనియర్‌ సిటిజన్‌ అకౌంట్‌ నుంచి వేల రూపాయలు స్వాహా చేశారు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని థానేకు చెందిన బాపూరావు షింగోట్‌ అనే వ్యక్తికి ఏప్రిల్ 2న ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము బ్యాంకు సిబ్బంది అని మీ బ్యాంకు అకౌంట్‌ను, ఆధార్‌ నెంబర్‌తో లింక్‌ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మీ మొబైల్‌ నెంబర్‌కు పంపిన ‘వెరిఫికేషన్‌ కోడ్‌’ను చెప్పమని వారు అడగ్గా.. నిజమేననుకొని షింగోట్‌ తనకు వచ్చిన ఓటీపీ మెసేజ్ చెప్పేశాడు. ఇంకేం దర్జాగా రూ. 75 వేలు డ్రా చేశారు ఆ వ్యక్తులు.   

గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాంకు అకౌంట్‌ నుంచి నగదు విత్‌డ్రా చేశారని తెలుసుకున్న షింగోట్‌ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. బ్యాంకులు నగదును ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్‌ చేయాలంటే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌లు తప్పనిసరి. ఓటీపీ టైప్‌ చేస్తే, లావాదేవీ పూర్తవుతుంది. ఈ విషయంపై స్పష్టత లేని అమాయకులను లక్ష్యంగా చేసుకొని.. బ్యాంకు ఉద్యోగులని చెప్పుకుంటూ.. ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగి తెలుసుకొని డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. నిజంగానే బ్యాంకు అధికారులు ఆధార్‌ లింక్‌ చేపడుతున్నారని భావిస్తున్న కస్టమర్లు ఈ పాస్‌వర్డ్‌ చెప్పి వేల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Read More