Home> జాతీయం
Advertisement

Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు, తేల్చి చెప్పేసిన కేంద్ర ప్రభుత్వం

Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో స్పష్టత ఇచ్చేసింది కేంద్రం. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఎవరెన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని ధర్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం వైఖరి మాత్రం మారలేదు. 

Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు, తేల్చి చెప్పేసిన కేంద్ర ప్రభుత్వం

Vizag Steel: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌కు తరలివెళ్లడం ఖాయమైపోయింది. ఓ వైపు స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు సమ్మెలు చేస్తున్నా..ధర్నాలు చేపట్టినా ఫలితం కన్పించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో నిర్ణయం మారలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. 

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం 2021లో నిర్ణయించింది. అప్పట్నించి ఈ నిర్ణయానిక వ్యతిరేకంగా ఆందోళన రేగుతోంది. విశాఖపట్నంలో స్టీల్‌ప్లాంట్ వద్ద కార్మికుల దీక్ష కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు అడపా దడపా మద్దతు ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికుల వెన్నంటి ఉంటామని స్పష్టం చేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎవరెన్ని ఉద్యమాలు చేసినా ప్రైవేటీకరణ నిర్ణయం మారదని కేంద్రం నిర్ద్వందంగా తేల్చి చెప్పింది. 

పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం లేదా విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ వద్ద కార్మికులు అదేపనిగా చేస్తున్న ఉద్యమం గురించి అసలు కేంద్ర ప్రభుత్వానికి తెలుసా లేదా ? కార్మిక సంఘాల సమ్మె నేపధ్యంలో ప్రైవేటీకరణను ఉపసంహరించుకునే ఆలోచన ఉందా అని టీడీపీ ఎంపీ ప్రశ్నించారు. 

కేంద్ర ప్రభుత్వం దీనికి స్పష్టంగా సమాధానమిచ్చింది. కొన్ని ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమ్మె గురించి తెలుసని..యాజమాన్యం ఆయా సంఘాలతో చర్చిస్తోందని తెలిపింది. అయితే 2021 జనవరి 27వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100 శాతం ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకునేలా తీసుకున్న కేబినెట్ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. 

అంటే ఇప్పటి వరకూ ఏపీలోని బీజేపీ నేతలు కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో మభ్యపెడుతూ వస్తున్నారా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఉద్యోగులు, కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయని తెలిసినా..నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెబుతుందంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో రాష్ట్రం విషయంలో కేంద్రానికి ఏపాటి విలువ ఉందో అర్ధమౌతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా మభ్యపెట్టే మాటలే చెబుతోంది. 

మరోవైపు ఇదే రాజ్యసభలో వైసీపీ ఎంపీ విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యం విషయమై ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఏటా 3.2 మిలియన్ టన్నుల నుంచి 7.3 మిలియన్ టన్నులకు విస్తరించినా అందులో మూడింట ఒక వంతే ఉక్కు ఉత్పత్తి అవుతోందనే విషయం నిజమేనా అని విజయసాయిరెడ్డి అడిగారు. దీనికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమాధానమిచ్చారు. ఇది వాస్తవం కాదని..విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఆధునికీరించినా..ఇంకా ఉత్పత్తి సామర్ధ్యాన్ని 7.3 మిలియన్ టన్నులకు విస్తరించలేదని తెలిపారు. 

Also read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. పెండింగ్ డీఏపై షాకింగ్ నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More