Home> జాతీయం
Advertisement

ఐపీఎల్ బెట్టింగ్ కేసులో అర్బాజ్ ఖాన్‌కి నోటీసులు

అర్బాజ్ ఖాన్‌కి పూణె పోలీసుల నోటీసులు

ఐపీఎల్ బెట్టింగ్ కేసులో అర్బాజ్ ఖాన్‌కి నోటీసులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పూణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్‌కి నోటీసులు జారీ చేశారు. శనివారం అర్బాజ్ ఖాన్‌ని తమ ఎదుట హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల సోను జలాన్ అనే బుకీని అరెస్ట్ చేసిన పూణె నేర విభాగం పోలీసులు అతడు వెల్లడించిన సమాచారం మేరకే అర్బాజ్ ఖాన్‌కి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్బాజ్ ఖాన్‌కి సోనూ జలాన్‌కి మధ్య స్నేహం ఉందని, మూడేళ్ల క్రితం వరకు ఈ ఇద్దరూ స్నేహంగా మెదిలేవాళ్లని సమాచారం. అయితే, అర్బాజ్ ఖాన్‌కి సంబంధించిన ఓ వీడియో సోనూ జలాన్ వద్ద వుండటంతో జలాన్ అప్పుడప్పుడు అర్బాజ్ ఖాన్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని పోలీసు వర్గాలకు తెలిసినట్టు వినికిడి. అయితే, ఆ వీడియోలో ఏం దాగి ఉందనే సంగతి మాత్రం ఎవరికీ తెలియదు. ఏదేమైనా సోనూ జలాన్ అరెస్ట్‌తో ఐపీఎల్ బెట్టింగ్ కేసులో పోలీసులు చాలా వరకు విజయం సాధించారు. ఐపీఎల్ కేసులో రేపు శనివారం పోలీసులు అర్బాజ్ ఖాన్‌ని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. 

అనేక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల్లో సోనూ జలాన్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సైతం అందులో ఒకటని పోలీసులు పేర్కొన్నారు. సోలూ జలాన్‌కి డి-కంపెనీ బాస్ దావూద్ ఇబ్రహీంతోపాటు అతడితో సత్సంబంధాలు కలిగిన మరో ఇద్దరు ఉగ్రవాదులతోనూ సంబంధాలున్నట్టు తెలుస్తోంది. 2018 ఐపీఎల్‌లో బెట్టింగుల ద్వారా దాదాపు రూ.500 కోట్లు వెనకేసిన జలాన్.. ఆ మొత్తాన్ని హవాలా మార్గాల్లో ముంబై నుంచి దుబాయ్‌కి, దుబాయ్ నుంచి కరాచికి తరలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో జలాన్ విలాసవంతమైన జీవితం సైతం వెలుగులోకొచ్చింది. 

జలాన్‌కి ముంబైలో మూడు లగ్జరీ ఫ్లాట్స్ వుండగా వాటిపై అద్దె రూపంలో అతడికి నెల నెలా భారీ మొత్తంలోనే ఆదాయం సమకూరుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు సమాచారం. ఇవేకాకుండా జలాన్ సొంతం చేసుకున్న లగ్జరీ వాహనాలకు ఇక కొదువే లేదు.

Read More